Monday, February 25, 2008

పాత సంగతులు

ఓ రెండు దశాబ్దాల క్రితం కాబోలు గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఆంధ్ర ప్రభ వార పత్రిక లో అడపా దడపా కవిత్వం మీద ఒక శీర్షిక నిర్వహించేవారు. పేరు నాకిప్పుడు జ్ఞాపకం లేదు. అందులో వారు ఈ కింది ముక్తక శ్లోకాన్ని పరిచయం చేసేరు.

ఈ శ్లోకం ఒక కవి రాజాశ్రయం కోరుతూ, రాజుని " రాజాధి రాజ, రాజ మార్తండా... " అంటూ పొగడకుండానూ, తన దురవస్థని కూడా మరీ " మాధవ కబళం పెట్టించండి, మహాప్రభో" అని చెప్పుకోకుండా పని కానిచ్చిన నేపధ్యం లోనిది.

అర్ధం దానవ వైరిణా
గిరిజయాప్యర్థం శివస్యాహృతం
దేవేత్థరం జగతీతలే
పురహరా భావే సమున్మీలతి


తాత్పర్యం ఏమిటంటే

శివుడి దేహంలో సగభాగం మోహినీ రూపంలో విష్ణువు, మిగిలిన సగం పార్వతీ తీసుకోగా, లోకంలో శివుడు లేకుండాపోయాడు. అపుడు శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ల గతి ఇలా అయ్యింది. గంగ సాగరాన్ని ఆశ్రయించింది. చంద్రకళ ఆకాశాన్నీ, నాగరాజు భూమినీ ఆశ్రయించారు. ఇక మిగిలిన మూడింటిలో సర్వజ్ఞత, అధీశ్వరత - ఓ రాజా నిన్నాశ్రయించగా, భిక్షాటన నన్ను ఆశ్రయించింది.

భావం పుర్తిగా వెలిబుచ్చినా, శ్లోకం అంతా వారు ప్రస్తావించలేదు. అప్పట్లో నాకు, పరిచయమున్న ఉభయభాషా కోవిదులు కొందరిని శ్లోకపు పూర్తి పాఠాన్ని గురించి అడిగేను. తాము వినలేదన్నారు. ఒక పని మీద శ్రీ తిరుమల రామచంద్ర గారిని కలవడం తటస్థించింది. మాటల సందర్భం లో, వారిని అడిగితే, వెంటనే వారు పూరించేరు.

సర్వజ్ఞతం అధీశ్వరత్వం మగమత్మాం
మాం చ భిక్షాటనం

తరువాత చాలా కాలం వరకూ, నాకు పై విధంగా తెలిసిన పూర్తి శ్లోకాన్నీ, తాత్పర్యాన్నీ ఒక చోట చేర్చి చూసుకోలేదు. ఈ మధ్యే కొన్నేళ్ల క్రితం, పాత కాగితాలు చూస్తోంటే, ఈ రాత ప్రతి కనిపించింది. కానీ శ్లోకంలో పాము, సముద్రాల ప్రస్తావన వున్నట్టనిపించలేదు. నేడు గుంటూరు వారూ, తిరుమల వారూ ఇద్దరూ కీర్తి శేషులే. ఎరిగినవారు తెలియజేస్తే ధన్యుణ్ణి.

మరొక్క మాట

ఎక్కడో చదివిన - రెండు ప్రశ్నలు, ఒకే జవాబు

1. కస్మై ప్రసీదతే విష్ణుః ? (విష్ణువెవరికి ప్రసన్నుడగును?)
2. కిం ఆంధ్రాణమతి ప్రియం? ( ఆంధ్రులకు ప్రియమైనది?)

చెప్పుకోండి చూద్దాం

1 comment:

oremuna said...

ఎవరైతే విష్ణు నామాలు కీర్తిస్తారో వారికి విష్ణువు ప్రసన్నుడు!

ఆంధ్ర మాత (గోంగూర )